Saturday, January 12, 2013



" తాపసి  "( by mercy margaret) 
------------------------------------------
అది చలి కాలం .పక్షులు వలస వెళ్ళే సమయం .ముందుకు వెనక్కు ,రెక్కలూపుకుంటూ ప్రయాణించే పక్షుల గుంపు . చీకట్లో ,  అదీ మబ్బుల్లో అలలు అలలుగా  ప్రయాణిస్తున్నప్పుడు వాటికి కనిపించేదంత మైళ్ళ ప్రయాణం అందులోను ఏ విడిదికో విహారయాత్రకు వెళుతున్నప్పుడు పిల్లలు పడే ఆనందంలాంటి ఆనందం .సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా ? అని చూసి ఒక గంట వాటిని వీటిని కేకలేసుని మరీ బయల్దేరాయి అవి కూడా ..   బిట్టు (ఆ వలసేల్లె పక్షుల్లో వయసులో అందరికన్నా చిన్నది ,ఇదే మొదటి సారి కూడా వలస ప్రయాణం చేయడం దానికి ) వాళ్ళ స్నేహితులందరూ ఒక గుంపుగా ముందే వెళ్ళిపోయారు . బిట్టు కన్నా ముందే ఒక సారి వలసెల్లిన తన స్నేహితులు ఆ విశేషాలు చెప్తుంటే ,ఎంత ఆసక్తితో వింతలన్నీటిని గురించి  విన్నదో .ఇప్పుడు కుటుంబంతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యింది .

ప్రయాణం తో పాటు  బిట్టు ప్రశ్నల ప్రస్థానం కూడా మొదలైయ్యింది . తెలుసుకోవాలనే తపనెక్కువ . కొత్త విషయాల మీద ఆసక్తి ఎక్కువ .ఎప్పుడు అల్లరిగా చిలిపిగా ,స్వేచ్చగా ఆకాశంలో పల్టీలు కొడుతూ తిరగడం అంటే ఎంతిష్టమో బిట్టుకి .రెక్కలొచ్చి ఎగరడం నేర్పడానికి బిట్టు వాళ్ళ అమ్మకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ,దీన్ని బట్టి అర్ధం చేస్కోవచ్చు బిట్టు ఎంత పట్టుదలున్న పక్షో . బిట్టు అడిగే ప్రశ్నలకు వాళ్ళ తాతగారే సమాధానాలు చెప్పే గురువు . కొంచెం ముందుగా ఎగురుతూ తాత పక్కకు చేరి 
- " తాత  మనం ఉదయం  ప్రయాణం చేయొచ్చుగా రాత్రిపూటే ఎందుకు వెళ్ళడం " ?అని అడిగింది 
- " ప్రయాణానికి రాత్రి పూటను ఎంచుకోవటానికి ప్రధానకారణం మన  శత్రువుల నుండి తప్పించుకోవటం అందుకే రాత్రి ప్రయాణమే శ్రేయస్కరం. మన పక్షుల్లో జీర్ణశక్తి అపారం. అతి తర్వగా జీర్ణం అవుతుంది. దూర ప్రయాణానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవటానికి తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోగలగటం. క్రొవ్వురూపేణ నిల్వచేసుకుంటాం . రాత్రి ప్రయాణం వలన ఎంతో వెసులుబాటు కూడా ఉంది. దీనితో పగలంతా ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవటానికి వీలవుతుంది. రాత్రివేళ ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండటంతో మనం కావలసిన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు శ్వాసక్రియ ద్వారా గాలి తిత్తులనుండి మనం నీటిని కోల్పోతాము . ఇలా నీటిని కోల్పోవటమే ప్రధానం గా ఏ పక్షైనా ఆగకుండా ఎంత దూరం పోగలదన్నది నిర్ణయిస్తుంది. " అని సామధానం చెప్పాడు  బిట్టు వాళ్ళ తాత .
- "ఓహో అలాగా " ..అంటూ ఎదో కొత్త విషయం నేర్చుకున్నట్టు సంబరపడుతూ మళ్ళీ దాని వరుసలో కెళ్ళి ఎగరడం మొదలుపెట్టింది బిట్టు .

మళ్ళీ ఇంకా ఏదో  గుర్తొచ్చి అడగడానికి ఎగురుతూ వెళ్లి మళ్ళీ తాత పక్కకు చేరింది .మళ్ళీ ఇంకో ప్రశ్నతో రాగానే బిట్టు వాళ్ళ తాతకు నవ్వుతో పాటు  కొంచెం అనాసక్తత కూడా  వచ్చినా రెండింటిని ప్రదర్శించకుండా ..
- " బిట్టు నీ ప్రశ్నలన్నీ టక టకా ఒక్కసారే అడిగేయ్ అంటూ " రెక్కల్లో వేగాన్ని తగ్గించుకుని బిట్టువైపు చూసాడు .
- " సరే గాని తాత .. మనం ఎందుకు వలసెళ్ళాలి ?? ఇలా ఎంత దూరం ప్రయాణించాలి ?? మనం వెళ్ళేది  సరి అయిన మార్గమే అని నీకెలా గుర్తుంటుంది ? "  అని అడగాల్సినవన్నీ కుతూహలం ఆపుకోలేక అడిగేసింది బిట్టు ..
- " అడగాల్సినవన్నీ అడిగావుగా అయితే విను  ...కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం కూడా  మన పక్షులం  వలస పోతాము . శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాము . ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణానికి పచ్చజెండా ఊపుతాయి. అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాము బిట్టు .
ఇక ఎంత దూరం  ప్రయాణిస్తామంటే .. మనం  90 గంటల వరకూ ఆగకుండా ప్రయాణించగలము . ఇందుకు గంటకు కేవలం అరగ్రాములోపు కొవ్వును ఖర్చుచేస్తే చాలు. ఆర్కిటిక్ టెర్న్ పక్షులు అన్నింటికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఇవి ఆకు రాలు కాలంలో ఉత్తర ధృవం నుండి బయలుదేరి దక్షిణ ధృవానికి చేరుకుని వసంతం వచ్చేసరికి తిరిగి ఉత్తర ధృవానికి వలస పోతాయి బిట్టు అని చెప్తూ 
బిట్టు మనం సాధారణంగా గాలివాలుకు అనుగుణంగా పయనించాలీ . సముద్రాల మీద పయనించేటప్పుడు కొన్నిసార్లు తుఫానుల్లో, సుడిగాలుల్లో చిక్కుకుని చాలా మంది మన బంధువులు చనిపోయారు  . భూమి పైన ఎగిరేటప్పుడు ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణాన్ని వాయిదా  వేసుకుని ఆహారం సేకరించుకుని, సేద తీర్చుకుంటూ ప్రయాణం సాగించాలి గుర్తుంచుకో " అని చెప్పాల్సిన , పంచాల్సిన  జ్ఞానం అనుభవం అంతా పంచి ఇక పద వేగాన్ని రెట్టించు అని బిట్టుని ప్రోత్సాహ పరుస్తూ  వేగాన్ని రెట్టించాడు బిట్టు తాత ఆ గుంపు పక్షుల  నాయకుడు .
ఎన్ని ఆసక్తికరమైన విషయాలో తెలుసుకుని సంతోషంతో ఆ చలిని రెక్కలకింద టప  తప లాడిస్తూ వలస ప్రయాణాన్ని ఆహ్లాదంతో అనుభవిస్తుంది బిట్టు . ఆ రోజు పౌర్ణమి . చంద్రుని వెన్నలను , తారల తళుకులను ,పొగ మంచు పోగులను మెత్తగా స్పృశిస్తూన్న అనుభవం బిట్టుకి .కొండలు లోయలు అడవులు కొలనులు అన్నిటిని గురించి ఎలా విన్నదో అలాగే  కనిపిస్తున్నాయి తనకి . మధ్య  మధ్యలో  పూల పరిమళాలను మోసుకొస్తున్న గాలికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొత్తానికి ప్రయాణాన్ని అందంగా అనుభూతిచెందుతుంది  బిట్టు .
 ఒక రోజు ప్రయాణం అయిపొయింది ఇంకో రోజు ప్రయాణిస్తే  ఎప్పుడు వెళ్ళే ఆ వలస ప్రాంతాన్ని చేరుకోవచ్చు .ఉదయం కొండల మధ్యనుంచి మంచు తెరను నెమ్మదిగా చుడుతూ రంగు మారుతూ పెరుగుతున్న సూర్యుడిని అలా చూడడం అదే మొదటి సారి బిట్టుకి .అక్కడి నీటి దారాలపై భానుడి కిరణాలు పడి ధగ ధగ మెరుస్తూ సప్త వర్ణాలు ఆవిష్కరిసుంటే , కళ్ళలో ఆ కాంతి పరావర్తనం చెంది కొత్త అనుభూతి పొందుతూ ఈ చెట్టు పై నుండి ఆ చెట్టు పైకి ఆ చెట్టు మీదనుండి ఇంకో చెట్టు పైకి ఎగురుతూ కొత్త కొత్తగా కిల కిలా రావాలు చేస్తుంటే బిట్టు తల్లి తండ్రులకి కుడా ఆనందమేస్తుంది .మొన్నా మధ్యే గూడు కట్టుకునేప్పుడు వాళ్లతో కలిసి ఒక్కో గడ్డి పోచ తీసుకుని వెళుతూ ఎంత సహాయంగా ఉందో  వాళ్ళకి . వాళ్ళుండే ఆ చెట్టుపై పక్షులన్నిటికి అంత ప్రేమ మరి బిట్టుని తన ప్రవర్తనని చూసి .ఆ రోజంతా ఆనందగా అక్కడే గడిపేసి మళ్ళీ సూర్యాస్తమయానికి ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరు . 

అదో దట్టమైన అడవి అక్కడ జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు కుటుంభసభ్యులు. ఒక్క సారిగా బిట్టుకు రక్షించమంటూ అరుస్తున్న మరో జాతి పక్షుల ఆర్తనాదాలు వినిపించాయి .. 
-"తాత తాతా  ఎవరో ప్రమాదంలో ఉన్నారు రక్షించమని అరుస్తున్నారు .సహాయ పడదామా  ?"అని  గుంపు నాయకుడ్ని అడిగింది బిట్టు . 
-" ఇలాంటివి పట్టించుకోవద్దు బిట్టు నువ్వు ఇంకా మారు మాట్లాడకుండా మాతో పాటు రా ..!" అంటూ ఆజ్ఞ జారి చేసాడు ,తల్లి తండ్రులది  కూడా అదే మాట . అలాగే అంటూ తన వరసకెళ్ళి  మళ్ళీ ప్రయాణిస్తుంది .కొద్ది దూరం ఆ గుంపు ప్రయాణం సాగించి బిట్టు తల్లి వెనక్కి  చూస్తే   ,అక్కడ బిట్టు కనిపించలేదు .కంగారుగా అందరికి విషయాన్ని  చెప్పి ఏడవడం మొదలు పెట్టింది తల్లి పక్షి  .
  
                                                  *   *    *     *    *   *    *

ఆ ఆర్తనాదాలు విని సహాయం చేయకుండా వెళ్లడం  బిట్టుకి నచ్చలేదు అందుకే మెల్లి మెళ్లిగా  వెనక్కి తగ్గి గుంపు నుంచి వెను  తిరిగి ఆ దట్టమైన అడవిలోకేల్లింది  బిట్టు . అలా అలా ఆ రోదన వినిపిస్తున్న స్థలానికి చేరుకుంది . తల్లి లేకుండా అల్లలాడుతున్న రెండు చిన్న పక్షులను ,ఇంకా ఎగరలేని  పక్షులను చూచి  ఒక్కో  విధమైన ప్రశ్నతొలుస్తుంటే ఆ గూట్లో వాలి ఏమయింది అని అడిగింది . గుక్క పట్టి ఏడుస్తూ అడవి పిల్లి గూటి పై దాడి చేస్తే తల్లి పక్షి పోరాడి ఎదిరించలేక ఓడిపోయి దానికి ఆహారంగా మారిన వైనాన్ని వివరిస్తూ ఏడుస్తుంటే బిట్టు కూడా కన్నీరు కార్చింది . మళ్ళీ ఏ క్షణమైనా అది వాళ్ళను తినడానికి తిరిగొస్తుందని అవి రెండు ప్రాణభయంతో గజ గజ వణికిపోతూ ఏడుస్తుంటే బిట్టుకి సహాయానికి రాని తాత తలి తండ్రులపై విపరీతమైన కోపం వచ్చింది .. కాని ఇప్పుడది ఒంటరిగా ఏం  చేయగలదు ?? ప్రమాదానికి ఇంకా కొన్ని అడుగుల దూరంలో ఉన్న పక్షుల జాబితాలో బిట్టు కూడా ఉన్నట్టే ఇప్పుడు .

ఆ చిన్నవైన రెండు పిల్ల పక్షులను  రక్షించడం ఇప్పుడు బిట్టు ముందు ఉన్న కర్తవ్యం . ఎలాగో ,అలాగా మొదట ఆ పిల్లల్ని అక్కడి ఆ గూట్లో నుంచి తప్పించాలి , ఏం  చేయాలి అని అలోచించి పక్కనే ఉన్న వెడల్పాటి ఆకులు గలిగిన చెట్టు నుంచి ఒక ఆకును విరిచి సరిగ్గా ఆ గూటికి కింద పరిచింది బిట్టు .ఇప్పుడు ఆ గూట్లోనుంచి  రెండు పక్షులను మెల్లిగా కిందకు తోసింది ధైర్యంగా ఉండమని నచ్చ చెప్పి ఒప్పించి మరీ .ఇప్పుడు ఆ రెండు పక్షులు చెట్టు కింద ఉన్న్న ఆ ఆకుపై ఒక దాన్ని ఒకటి హత్తుకుని కూర్చున్నాయి .బిట్టు ,మెల్లి మెల్లిగా ఆ ఆకును నోటితో లాగుతూ గూడున్న  చెట్టుకు కొంత దూరంలో ఒక కలుగు ఉంటె అందులో వీటిని దాచి దాన్ని ఆకుతో కప్పిన వెంటనే పిల్లి వస్తున్న శబ్ధం విని  చెట్టు వెనక దాక్కుని చూస్తుంది . మంచి భోజనం దొరికిందని ఆత్రంగా తిరిగొచ్చిన వచ్చిన పిల్లికి గూట్లో పక్షి పిల్లలు కనిపించక పోయే సరికి కోపంతో అరుస్తూ ఆ చెట్టంతా  చూసింది అయినా అవి దొరకలేదు . మెల్లిగా చెట్టు దిగి వెను  దిరగ బోతుంటే చెట్టు వెనక దాక్కున్న బిట్టు కనిపించింది . 
వెంటనే బిట్టుని పట్టుకొనడానికి బిట్టు పైకి దూకింది పిల్లి .ఆ చిన్న దేహంతోనే ఆ పిల్లితో యుద్ధానికి దిగింది బిట్టు .ఎంత బలాన్ని కూడ దీసుకున్నా ఏంలాభం  ? బిట్టుకి వంటినిండా గాయాలయ్యాయి అయినా తన ముక్కుతో దాడి చేయడానికి వచ్చిన పిల్లిని పొడుస్తూనే ఉంది .. ఆ ప్రయత్నంలో బిట్టు కాలు విరిగింది ఇక బిట్టు కూడా చేతులెత్తేసే సమయం కళ్ళు మూతలు పడుతుంటే ఒంటినిండా రక్తం స్రవిస్తుంటే ఒక్కనిమిషం తల్లి దండ్రులను ,తాతని గుర్తు చేసుకుంది .ఇక పిల్లి చివరిసారిగా బిట్టుపై తన బలమైన పంజాతో విరుచుకు పడపోబోతుంటే .....

                                                   

                            *     *     *      *     *       *      *   *

...
............ఆశ్చర్యం ,బిట్టు కుటుంబం , పక్షుల గుంపు అంతా  వచ్చాయి ఆ పిల్లిని పొడిచి పొడిచి బెదర గొట్టి తరిమేసాయి .స్పృహ కోల్పోతున్న బిట్టుని ఆప్యాయంగా నిమురుతూ పక్కనే ఏవో పాఠాలు ఔషదపు  ఆకులుంటే దాన్ని బిట్టు గాయాలపై రాస్తూ , తన మెలకువ గురించి చూస్తున్నాయి బిట్టు కుటుంబ సభ్యులన్నీ .కొద్ది సేపటి తరువాత బిట్టుకి మెలకువ వచ్చింది కాని ఎగిరే ప్రయత్నం చేస్తున్నబిట్టు ఒక నిమిషం అలా కూల బడిపోయింది , దాని కాలు ఒకటి విరిగిపోయింది ఇకపై అది ఎగరగలదేమో కాని నిలబడలేదు . బాధ ఏంటో తెలుస్తున్నా భరించడం కూడా అప్పుడప్పుడే నేర్చుకున్నట్టుంది .తల్లిని పిలిచి ఆ కలుగు పై ఆకుని తొలగించమన్నది .అలాగే చేసిన తల్లికి రెండు చిన్న పక్షి పిల్లలు ఒక దాన్ని ఒకటి హత్తుకొని భయంతో కూర్చోవడం చూసి బయటికి లాగింది . ఎం జరిగిందో అంతా ఉన్నది ,ఉన్నట్టుగా వాళ్ళందరికీ వివరించాయి ఆ చిన్న పక్షులు .బిట్టు చేసిన పనికి మెచ్చుకున్నా జీవితాంతం ఇక కాలు లేని పక్షిగా ఉంది పో వలసిందే బిట్టు .అయినా రెండు ప్రాణాల్ని కాపాడిన ఆనందం  ముందు అదేది కనిపించడం లేదు . ఆ రెండు పక్షులను ఆ గుంపులోని పెద్ద పక్షులు నోటికి కరుచుకుని ,బిట్టుని తల్లి తండ్రి ఇద్దరు భుజాల రెక్కలపై ఎక్కించుకుని ప్రయాణం సాగించాయి .

అనుకున్నట్టే కాక పోయిన ,ఆలస్యంగా అయినా వలస  వెళ్ళాల్సిన స్థలానికి చేరుకున్నాయి .బిట్టు స్నేహితులందరికీ తను చేసిన సాహసం గురించి తెలిసింది అందరు చూడడానికి వస్తున్నాయి .ఒక్క కాలుతో ఇక కుంటుతూ మెల్లిగా నడవడం , ఒక కొమ్మ మీదనుంచి ఇంకో కొమ్మ పైకి ఎగిరి అక్కడ కూర్చుని స్నేహితులతో కబుర్లు చెప్పుకునే పరిస్థితి ఇప్పడు లేదు బిట్టుకి .అలా ఆలోచిస్తూ ఆ అనాధ అయిన పక్షులని  చూస్తూ వాటితో ప్రతి రోజు మాట్లాడుతూ ఆది పొందే అనుభవాలన్నీ .చెప్పింది ... ప్రాణానికి మించి ప్రయాస పడి  కాపాడిన బిట్టునే వాటికి ఇప్పటిన్చుచి అమ్మా నాన్నా అన్నీ  అని నిర్దారించుకుని జీవితాంతం బిట్టుకు చేదోడు వాదోడు గా ఉంటామని తీర్మనంచు కున్నాయి ..
వలస కెళ్ళిన ప్రాంతాన్ని   అలా కొంచెం సేపు ఒంటి కాలుతోనేఎగురుతూ ఆ ప్రాంతమంతా చూసి హాయి నింపుకుని తన జీవిత ఉద్దేశం ఇదే కాబోలు అనుకోని తాత దగ్గర కూర్చొని ఇంకా అనుభవపు పాఠాలు నేర్చుకునే ఆసక్తి ఉందని -" తాతా "  అని పిలిస్తే , బిట్టు తాత కళ్ళలో కన్నీళ్ల ప్రశ్నలన్నీ కరిగి -" జీవితం గురించి  తాతకే ఒక పాఠం నేర్పావు బిట్టు అని " గట్టిగా బిట్టుని హత్తుకున్నాడు తాత ,నా ఆయుష్షు కూడా నువ్వే పోసుకుని తరువాత ఈ గుంపుకి నువ్వే నాయకుడవని చెప్పి అనుభవానికి ,మంచి మనసుకి ,అంగవైకల్యం ఎప్పుడు అడ్డురాదని అందరికి ఆ రోజుటి ప్రభోదన చేస్తూ ..



---------------------------------  by -Mercy Margaret (13/12/2012)_--------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment